శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. కార్యక్రమానికి జిల్లాలో ముఖ్య నాయకు లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నట్లు తెలిపారు. దగా డీఎస్సీ కార్యక్రమం పొన్నాడ వంతెన, మహా త్మా జ్యోతిరావుపూలే పార్కు వద్ద జరగనుందని, ఈ కార్యక్రమానికి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు.
విమ్స్ డైరెక్టర్గా మందస వాసి
మందస: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) డైరెక్టర్గా మందసకు చెందిన డాక్టర్ వి.మన్మథరావు నియమితులయ్యారు. మన్మథరావు మండలంలోని డబారు గ్రామంలో జన్మించారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. హరిపురం పీహెచ్సీలో తొలి పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం కేజీహెచ్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. విమ్స్ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
నేటితో ముగియనున్న బీపీసీఎల్ టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పురోహిత్ బ్రాహ్మణ క్రికెట్ లీగ్ టోర్నీ తుది దశకు చేరుకుంది. సోమవారంతో ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగియనుంది. ఐదురోజులపాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ఫైనల్ పోరులో విశాఖపట్నం ఆచార్య జట్టు, మహావీర్ కింగ్స్ (మోదిదేవి విజయవాడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం) జట్టు తలపడనున్నాయి. కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్కు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, బ్రాహ్మణ సంఘం రాష్ట్రస్థాయి నాయకులు హాజరు కానున్నట్టు నిర్వహణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
విద్యుత్ శాఖ ఇన్చార్జి ఎస్ఈగా సురేష్కుమార్
అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సర్కిల్ ఎస్ఈగా జి.సురే ష్కుమార్కు ఇన్చార్జి బా ధ్యతలు అప్పగిస్తూ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఇంతవరకు ఎస్ఈగా విధుల్లో ఉన్న నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం పదవీ విరమణతో టెక్నికల్ ఈఈగా పనిచేస్తున్న సురేష్కుమార్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. మరో రెండు రోజుల్లోగా రెగ్యులర్ ఎస్ఈ నియామకాన్ని చేపట్టనున్నారని సమాచారం.
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నాడ బ్రిడ్జి వద్దగల పొన్నాడ గ్రామంలో గత 41 రోజులుగా నిర్వహించిన వేసవి తరగతులు ఆదివారం ముగిశాయి. శ్రీఅయ్యప్పపీఠం, శ్రీహరేరామ భక్త భజన బృందం ఆధ్వర్యంలో చిన్నారులకు భగద్గీత పఠనం, విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ సహస్ర పఠనంపై తరగతులు జరిగాయి. ముగింపు సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు దాతల సహకారంతో అందజేశారు.


