శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి పెద్దరెల్లివీధిలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది సిబ్బందితో 250 ఇళ్లను సెర్చ్ చేసి సరైన పత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. సీఐ పి.ఈశ్వరరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సెర్చ్ చేసినట్లు తెలిపారు. వ్యక్తుల ఆధార్కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్ కల్యాణ్, చంద్రకళ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లి: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు సత్వర సేవలందించడంలో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఉత్తమ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని విద్యుత్ శాఖ ఇంజినీర్లు ప్రశంసించారు. సర్కిల్ ఎస్ఈగా పనిచేసిన నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా స్థానిక విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో కృష్ణమూర్తి దంపతులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సిబ్బంది సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. జిల్లా సర్కిల్లో ఎస్ఈ హోదాలో ఉన్నతాధికారులతో ఎంతో గౌరవాన్ని పొంది.. తద్వారా జిల్లా సర్కిల్కు మంచి గుర్తింపు తెచ్చారని వక్తలు కొనియాడారు. అత్యధిక కాలం జిల్లా ఎస్ఈగా పనిచేసి, ఇక్కడే పదవీ విరమణ చేస్తూ రికార్డు సృష్టించారని ఇన్చార్జి ఎస్ఈ సురేష్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పైడి యోగేశ్వరరావు, బయ్యన్నాయుడు, నరసింగ్కుమార్, యజ్ఞేశ్వరరావు, విష్ణుమూర్తి, విశ్రాంత విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఎస్ఈవో శ్రీనివాసరావు, ఏఏవోలు మహంతి ప్రభాకరరావు, సుదర్శనరావు, జేఏవోలు సనపల వెంకటరావు, ఆర్.శ్రీనివాస్, ఏఈలు జె.సురేష్కుమార్, కె.జయరాం, కమల్హాసన్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు.


