నరసన్నపేట: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో తీవ్ర అవకతవకలు జరిగాయని, మెరిట్ లిస్టు ప్రకటించకుండా నచ్చిన వారికి పోస్టులు అమ్ముకున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర అవకతవకలు జరిగాయని అన్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా తమకు నచ్చిన వారికి డబ్బులకు ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో మెరిట్ జాబితా విడుదల చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కో పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అమ్ముకున్నారని విమర్శించారు. నరసన్నపేటలోనే అనిల్ అనే అభ్యర్థి తీవ్రంగా మోసపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ అనిల్ తిరుగుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో ఎంకై ్వరీ చేయించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకల్లా జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధ్యక్షతన ‘నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్’, రోడ్ సేఫ్టీ కమిటీలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గంజాయి కట్టడితో పాటు రహదారి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరఫున పాల్గొన్న అదనపు ఎస్పీ కేవీ రమణ మాట్లాడుతూ.. జిల్లాలో గడిచిన మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం 18 కేసులు నమోదు చేసి, 119.53 కిలోల గంజాయిని, 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 40 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఏపీకి చెందిన వారు 17 మంది కాగా.. ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, కేరళ, దిల్లీ రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో రణస్థలం వద్ద జాతీయ రహదారి. విస్తరణ పనులు, శ్రీకాకుళం బైపాస్ జంక్షన్ వద్ద త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.


