శ్రీకాకుళం కల్చరల్: సర్వశిక్ష అభియాన్ ఒకేషనల్ విభాగం ద్వారా అంపోలులో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాలకు చెందిన హెల్త్ ఇన్స్ట్రక్టర్లకు రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ద్వారా ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కల్పించారు. జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు పర్యవేక్షణలో మేనేజర్ కె.సత్యనారాయణ, జి.రమణలు ప్రథమ చికిత్స, గాయాలు, కట్లు, తరలింపు మార్గాలు, కృత్రిమ శ్వాస, సీపీఆర్, కాలిన గాయాలు తదితర వైపరీత్యాల నుంచి రక్షించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.చిట్టిబాబు, రెడ్క్రాస్ సిబ్బంది చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2న జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ/డీఎల్టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జూన్ 2వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. కేవీఆర్ ఇంజినీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తుట్ మైక్రోఫిన్ లిమిటెడ్, 2050 హెల్త్కేర్ సంస్థల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్మేళాను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆకర్షణీయమైన వేతనంతో పాటు అనేక వసతి రాయితీలు ఉంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు. బయోడేటా, విదార్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్ఫొటోలతో ఆరోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా సంస్థ వద్దకు చేరుకోవాలని కోరారు.


