శ్రీకాకుళం న్యూకాలనీ :జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలని క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు కోరారు. జిల్లా క్రికెట్ సంఘం కీలకంగా చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి ఇప్పటికై నా మారాలని.. మారకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో జిల్లా పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా జిల్లా స్థాయి పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. జిల్లా క్రికెట్ సంఘం జిల్లా తరఫున ఎంపిక చేయబడే జట్టును పూర్తిగా ఈ జిల్లాలో ఉంటూ.. సాధన చేస్తున్నటువంటి క్రీడాకారులతో భర్తీ చేయాలని, ఈ జట్టును మాత్రమే పైస్థాయి పోటీలకు ఆడించడానికి పంపించాలని కోరారు. ఇతర జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి.. శ్రీకాకుళం జిల్లాకి రిప్రజెంట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కొందరు ఏకంగా ఆధార్ కార్డులను శ్రీకాకుళం జిల్లాకి మార్చి ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్, ఎస్పీకి అభ్యర్థన పత్రం ఇవ్వాలని తీర్మానించారు.


