నాయకుడితో
బొమ్మనాట సునీల్కుమార్.. వమవరల్లి గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్. వేట అంటే ఏంటో తెలియని ఈయనకు చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకార భృతికి అర్హుడిని చేసింది.
వమరవల్లి గ్రామానికి చెందిన సుగ్గు శంకరనారాయణ.. కొన్నేళ్లుగా హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నాడు. బందరువానిపేట తీరంలో వేటకు వెళ్తున్నాడని పథకం డబ్బులు ఖాతాలో వేశారు.
కళింగపట్నం పంచాయతీ సిలగాంకు చెందిన కొల్లి ధనరెడ్డి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఈయన వేటకు వెళ్తున్నాడని పథకంలో చేర్చారు.
పూజారి వెంకటరావు అనే యువకుడు విశాఖపట్నంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. వమరవల్లి గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఈయన కూడా అర్హుడంటూ పథకం వర్తింపజేశారు.
గార: బందరువానిపేట క్లస్టర్లో ఈ ఏడాది మత్స్యకార సేవలో పథకం 1181 మందికి ఇచ్చారు. వీరిలో దాదాపు యాభై మంది వరకు అనర్హుల పేర్లను ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో చేర్చిందని గ్రామ స్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మత్స్యకా ర సేవలో పథకం అర్హుల జాబితా చూస్తే ఇంటి పేరు లేకుండా కొందరి పేర్లు కనిపించాయి. దీంతో స్థాని కుల అనుమానాలు బలపడ్డాయి. వమరవల్లి గ్రామానికి చెందిన మండల స్థాయి టీడీపీ నాయకుడి సిఫారసుతో వేటకు వెళ్లని వారి పేర్లు నమోదయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఏటా చేపల పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు సముద్రంలో వేట నిషేధం అమలవుతోంది. ఈ నిషేధం సమయంలో వేటకు వెళ్లలేకుండా ఉండిపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తోంది. వేటకు వెళ్లిన వారికి మాత్రమే అందాల్సిన నిషేధ భృతి బందరువానిపేటలో అనర్హుల చేతిలోకి వెళ్లింది. బందరువానిపేట తీరంలో వేరే గ్రామానికి చెందిన వారెవ్వరూ వేటకు వెళ్లే పరిస్థితి లేదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారే ఈ తీరం నుంచి వేటకు వెళ్తారు. కూటమి నాయకులు, బోటు యజమాను లతో కుమ్మకై ్క ఏకంగా మత్స్యకారులు కాని వారిని, జిల్లాలో ఉండని వారిని సైతం జాబితాలో చేర్చి నిధులను విడుదల చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారునికి వచ్చిన రూ.20 వేలులో నీకింత, నాకింత అంటూ పంపకాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.
నిబంధనలు ఇవి..
పథకం ఎంపిక చేసేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న బోటు యజమాని తనతో పాటు మరో ఐదుగురు కళాసీలు (మత్స్యకారులు) పేర్లతో డిక్లరేషన్ ఫారమ్ ఇవ్వాలి. వాటి ఆధారంగా సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ బోటును పరిశీలించడంతో పాటు వారి ఆరుగురు వ్యక్తులనూ పరిశీలించాలి. ఇవేమీ జరగకుండా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మండల మత్స్య అభివృద్ధి అధికారి ఎస్.ముసలినాయుడు వద్ద ప్రస్తావించగా బోటు యజమాని ఇచ్చిన పేర్లు ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. బందరువానిపేటలో వమరవల్లి, కళింగపట్నం గ్రామాల్లోని వేరే కులాలకు చెందిన వారు లబ్ధిదారులుగా ఉన్నారని స్థానిక మత్స్య సహకార సంఘం 26 మంది పేర్లు ఇవ్వడంతో, వారి పేర్లను ఉన్నతాధికారులకు అందించి పథకానికి అనర్హులుగా తేల్చామన్నారు.


