శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో జనగణన గృహ జాబితా లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమైందని, ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రజలతో స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్తున్న సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి, సరైన వివరాలు అందించాలని కోరారు. డేటా నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.


