శ్రీకాకుళం క్రైమ్ :
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు యువత భవితను నాశనం చేస్తుండటంతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లను అందజేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీని ద్వారా మత్తుపదార్థాలు సేవించేవారు నిమిషాల్లోనే దొరికిపోతారని ఎస్పీ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు ఈ కిట్లను పంపిణీ చేశామన్నారు. ఈ కిట్ల ద్వారా మూత్ర నమూనాను పరీక్షించి కేవలం 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లోగా మత్తుపదార్థాలు సేవించారా లేదా అన్నది నిర్ధారించవచ్చని, పరీక్షల్లో పాజిటివ్ తేలిన వారికి కౌన్సిలింగ్ తో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, గంజాయి సేవిస్తూ, విక్రయిస్తూ ప ట్టుబడిన వారిపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే డయల్ 112 లేదా 1972కు సమాచారం అందించాలని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
పట్టుబడిన 30 మంది అనుమానితులు ..
ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలోని డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్య వేక్షణలో వన్టౌన్, టూటౌన్, ఆమదాలవలస, ఎచ్చెర్ల పీఎస్ల పరిధుల్లో 30 మంది అనుమానితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్షన్ కిట్ల ద్వారా మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తే దొరకడం గ్యారెంటీ
స్టేషన్లకు డ్రగ్ డిటెక్షన్ కిట్ పంపిణీ
జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు
మొదటిరోజే 30 మంది అనుమానితులు పట్టుబడిన వైనం


