వజ్రపుకొత్తూరు: విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోగలుగుతారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు అన్నారు. పూండిలో శనివారం జరిగిన యువతరం సేవా సమితి ఆరో వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పూండి కేంద్రంగా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో జిల్లాలోని 30 మండలాల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన 68 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిపి సన్మానించారు. రూ.3వేలు, రూ.2వేలు చొప్పున నగదు బహుమతులు అందించారు. ఇటీవల 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు మండల స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యువతర సేవా సమితి అందించిన సేవలకు గాను పూండి కేంద్రంగా ఉన్న స్పూర్తి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కెంగువ రాంబాబు రూ.1,04,000 చెక్ను యువతరం సేవా సమితికి అందించారు. కార్యక్రమంలో టెక్కలి ఉప విద్యాశాఖాధికారి పి.విలియమ్స్, ఎంఈఓ బి.వి.రమణ, యువతరం సేవా సమితి అధ్యక్షుడు చింత మురళి, స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు కెంగువ రాంబాబు, సేవా సమితి ప్రతినిధులు సునీల్, పృథ్వీ, రవి, రమేష్, నిహాల్, అపర్ణ, విఘ్నేష్, పుష్పలత, ఎల్.లత, జి.వెంకటరమణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


