అరసవల్లి: ఈదురు గాలుల బీభత్సం వల్ల విద్యుత్శాఖ శ్రీకాకుళం డివిజన్లో శనివారం నాటికి కూడా పలు మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. విద్యుత్శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా ఇవ్వలేకపోయారు. పిడుగుల ధాటికి నాలుగు చోట్ల ఇన్సులేటర్లు పేలిపోవడంతో బ్రేక్డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా లోడ్ డిస్పాచ్ సెంటర్ విజయవాడలో తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 132 కేవీ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో విద్యుత్ సరఫరాను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేశారు. గాలుల ప్రభావిత మండలాలతో పాటు మిగిలిన ప్రాంతాలలో కూడా శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాలలో ఆపరేషన్ ఈఈ పైడి యోగేశ్వరరావు ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొత్త ఇన్సులేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫీడర్ల మరమ్మతులను 33కేవీ, 11కేవీ లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.


