కవిటి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండేళ్ల తర్వాత ఉద్దానం కిడ్నీవ్యాధులపై హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ, ఐసీఎంఆర్ల వైద్యబృందాలు శుక్రవారం ఉద్దానం ప్రాంతంలో అధ్యయన పరీక్షలు ప్రారంభించాయి. కిడ్నీవ్యాధుల నిర్మూలన అంశంపై ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇదే సమస్యపై పలుమార్లు శాసనమండలిలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ చర్యలు ఫలించి నేడు వైద్యపరీక్షల దిశగా ప్రభుత్వం రెండేళ్ల తర్వాత సిద్ధమయింది. ఈ మేరకు హైదరాబాద్లో సీసీఎంబీకి చెందిన డాక్టర్ తంగరాజ్ ,సిబ్బంది, ఐసీఎంఆర్కు చెందిన డాక్టర్ సుధాకర్ల వైద్య బృందం పర్యవేక్షణలో కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనేందుకు హోల్ జీనోమ్ సెక్వెన్సింగ్ కోసం రక్త నమూనాలను సేకరించింది. ప్రతీ పీహెచ్సీ పరిధిలో రక్తనమూనాలను సేకరించారు. సీరంక్రియేటినైన్ 3 కన్నా అధికంగా ఉన్నవారు, 50 ఏళ్లలోపు డయాలసిస్ చేయించుకుంటున్నవారు, డయాలసిస్ బాధితులు ఉన్న కుటుంబంలో ఉన్న ఆరోగ్యవంతులైన వారినుంచి రక్తనమూనాలు సేకరించి.. అధ్యయనం చేసేదిశగా వైద్యబృందం చర్యలు ప్రారంభించింది.


