ఇంటింటికీ బీఎల్‌ఓలు | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ బీఎల్‌ఓలు

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

ఓటర్ల జాబితా సవరణకు ప్రణాళిక

జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహణ

సెప్టెంబర్‌ 22న తుది జాబితా

ప్రచురణ

నరసన్నపేట: జిల్లాలో ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) నిర్వహణకు అధికార యంత్రాగం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూన్‌ 15 నుంచి జూలై 14 వరకూ నెల రోజుల పాటు 2358 మంది బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసి ఓటర్లు నుంచి వివరాలు నమోదు చేయించి తిరిగి సేకరిస్తారు. 2002లో ఉన్న ఓటర్లు జాబితాను 2025లో ఉన్న జాబితాతో మ్యాప్‌ చేస్తారు. జులై 21న ముసాయిదా ఓటర్లు జాబితాలను విడుదల చేసి మరో సారి అర్హులైన ఓటర్ల నుంచి నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇదీ షెడ్యూల్‌..

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌ నమోదుకు జిల్లా యంత్రాగం ప్రత్యేక షెడ్యూల్‌ తయారు చేసింది.

● జూన్‌ 5 నుంచి 14 వరకూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

● జూన్‌ 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్‌ఓలు ఇంటింటా పరిశీలన చేసి వివరాలు సేకరిస్తారు.

● జూలై 14న పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ చేపడతారు.

● జూలై 21న ముసాయిదా ఓటర్లు జాబితాలను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకూ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ, కొత్తగా నమోదుకు అవసరమైన దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్‌ 18 లోగా పరిష్కరిస్తారు.

● ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత 2002 ఓటర్లు జాబితాలతో అనుసంధానం కాని, అనుసంధానంలో వ్యత్యాసాలు ఉన్న వ్యక్తులకు ఓటర్లు నమోదు అధికారి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన వ్యక్తుల జాబితాలను అసెంబ్లీ నియోజకవర్గం వారీగా విడుదల చేస్తారు. ముసాయిదాలో పేరు ఉన్న వ్యక్తి వివరాలపై సరైన విచారణ జరపకుండా పేరును తొలగించే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 18లోగా అన్ని అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్‌ 22న తుది ఓటర్లు జాబితా అధికారికంగా ప్రకటిస్తారు.

నియోజకవర్గం ఓటర్లు

నరసన్నపేట 2,16,960

ఇచ్ఛాపురం 2,73,207

పలాస 2,22,334

టెక్కలి 2,38,716

పాతపట్నం 2,28,375

శ్రీకాకుళం 2,75,843

ఆమదాలవలస 1,90,025

ఎచ్చెర్ల 2,48,566

Advertisement
 
Advertisement
Advertisement