పలాస: బొడ్డపాడులోని జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో ఈ నెల 27న జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ కన్వీనర్ పోతనపల్లి కుసుమ తెలిపారు. ఈ మేరకు స్మారక మందిరం వద్ద బుధవారం కరపత్రాలు, వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం కాలంలో మొదటిసారిగా 1969 మే 27న జరిగిన బూటకపు ఎన్కౌంటరులో అప్పటి సి.పి.ఐ.ఎం.ఎల్ కేంద్రకమిటీ నాయకుడు పంచాది కృష్ణమూర్తితో పాటు బొడ్దపాడు గ్రామానికి చెందిన బైనపల్లి పాపారావు, దున్న గోపాలరావు, నిరంజన్ సాహు, రామచంద్రప్రదానో, శృంగవరపు నరసింహులు తదితరులు అమరులయ్యారని చెప్పారు. వారి జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది జిల్లా అమరవవీరులు స్మారక సభలను గత 37ఏళ్లుగా బొడ్డపాడులో నిర్వహిస్తున్నామని వివరించారు. అప్పటి శ్రీకాకుళం పోరాటంలో మొత్తం 360 మందికి పైగా మృతి చెందారని, వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడమే ఈ సభ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జోగి కోదండరావు, వంకల మాధవరావు, మద్దిల రామారావు, కోనేరు రమేస్, గొరకల బాలకృష్ణ, కుత్తుం ద్యుంతు, సాలీన కుమార్, బుడత బాలరాజు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


