జి.సిగడాం: టంకాల దిగ్గువలస గ్రామానికి చెందిన వలస కూలీ గూండ్రి రామకృష్ణ (40) ఒడిశాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రామకృష్ణ కొరాపుట్ జిల్లా లమాతాపుట్ మండలంలో పనుల కోసం వలస వెళ్లాడు. ఈ నెల 17న సెంట్రింగ్ పనులు చేస్తూ జారిపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే విజయనగరం తీసుకొచ్చి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. రామకృష్ణ మృతిపై కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఒడిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసునమోదు చేశారు. బుధవారం టంకాల దిగ్గువలస శ్మశాన వాటికలో పూడ్చిన మృతదేహాన్ని వెలిగికి తీశారు. కుటుంబ సభ్యులు, రాజాం సీహెచ్సీ వైద్యులు, వీఆర్ఓ కాయల శ్రీనివాసరావు, లమాతాపుట్ పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. రామకృష్ణకు భార్య పార్వతి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. పేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రామకృష్ణ(ఫైల్)


