● ఇసుక దందాపై బాధితుల ఆందోళన
● లారీలకు అడ్డంగా రోడ్డుపై
బైఠాయించిన గ్రామస్తులు
● కూటమి నేతల ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ రవాణా
శ్రీకాకుళం రూరల్:
ఇసుక దందా ఆగడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చుట్టు పక్కల గ్రామస్తులంతా ఆదివారం నిరసనలు చేపట్టి వందల కొద్దీ ఇసుక లారీలను రోడ్లపై ఎక్కడికక్కడే ఆపేశారు. మండల పరిధిలోని రాగోలు, బావాజీపేట, కూటికుప్పలవానిపేట, రాగోలు పేట, దూసి గ్రామాల మీదుగా వెళ్లిన లారీలను ఆయా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఇసుక లారీలు కారణంగా తమ రహదారులు పాడైపోయాయని, ఎక్కడికక్కడికే పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం నిరసనలు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా గ్రామాల్లోకి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని, ఈ లారీల అక్రమ రవాణా కార ణంగా రాత్రిళ్లు ప్రమాదాలకు గురవుతున్నామని ఆందోళన చేశారు. ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిరసనలు చేపట్టడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు.
కూటమి నేతల ఆధ్వర్యంలోనే..
వాస్తవంగా అక్రమ ఇసుక రవాణా అంతా కూటమి నేతల ఆధ్వర్యంలోనే రాత్రింబవళ్లు సాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాలు గల నాగావళి, వంశధా ర నదులు నుంచి టన్నుల కొద్దీ ఇసుకను తోడేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రధానంగా ఆమదావలస మండలంలోని దూసి, ముద్దాడపేట, కలివరం, తొగరాం, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం.
లారీల ముందు ధర్నా చేస్తున్న దృశ్యం
రోడ్లన్నీ పాడైపోయాయి
అక్రమ ఇసుక రవాణా కారణంగా మా రోడ్లన్నీ పాడైపోయాయి. ఈ రోడ్లపై నడవాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. స్కూల్కు వెళ్లే విద్యార్థులు సైతం ఈ దారి గుండా వెళ్లడానికి భయపడుతున్నారు. – ఎం.జగదీష్, బావాజీపేట
మాకు న్యాయం చేయాలి
మా గ్రామాలకు వెళ్లడానికి ఇవే ప్రధాన రహదారులు. ఇసుక వాహనాల వల్ల దారులన్నీ ధ్వంసమైపోయాయి. రాగోలుపేట, బావాజీపేట, దూసి మీదుగా దుమ్ము ధూళి ఎగిరిపడుతోంది.
– పి.వెంకటరమణ, కూటికుప్పలపేట


