ఇచ్ఛాపురం రూరల్: తన కింద పనిచేసే వ్యక్తిపై యజమాని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇంటికి తాళాలు వేసి పిల్లల్ని అర్థనగ్నంగా బయటకు గెంటేశారంటూ శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘మంటగలిసిన మానవతత్వం’ కథనానికి అధికారులు స్పందించారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ జనార్దనరావు ఆధ్వర్యంలో బాధితుడు కోళ్ల మన్మధరావుకు శనివారం ఇంటి తాళాలు అప్పగించారు. 15 రోజుల్లో ఇల్లు తమ సొంతమని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో ఇంటిపై హక్కులు కోల్పోతారని ఎస్ఐ ఇంటి తాళాలు ఇప్పించారని మన్మధరావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పెద్దలకు బాధితుడు కృతజ్ఞతలు చెప్పారు.


