రణస్థలం : జె.ఆర్.పురం పంచాయతీలోని స్టార్ గోల్డ్ (వన్ గ్రామ్ గోల్డ్) షాపులో నకిలీ బంగారం అమ్మేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులు, షాపు యజమాని రమణ తెలిపిన వివరాల ప్రకారం.. వన్ గ్రామ్ గోల్డ్ షాపునకు ఐదు రోజుల క్రితం ఓ మహిళ, ఇద్దరు పురుషులు వచ్చి నల్లపూసలు దండ కొనుగోలు చేసుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి తమ వద్ద 300 ఏళ్ల క్రితం కాయిన్స్, బంగారం ఉందని, కొనుగోలు చేయాలని కోరారు. అయితే తన వద్ద డబ్బులు లేవని, మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించేశారు. ఇంతలో వారు తెచ్చిన బంగారం తాలుకా ఫొటోలను స్నేహితుడికి పంపించి ఆరా తీయగా.. కొంత ఒరిజినల్ చూపి మిగతా అంతా నకిలీ బంగారం అంటగడతారని, కొనవద్దని చెప్పారు. మూడు రోజులుగా వారిపై నిఘా వేసి క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు కేజీ నకిలీ గొలుసులతో రాగా చాకచక్యంగా వారిని పట్టుకుని జె.ఆర్.పురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై ఎస్.చిరంజీవి చెప్పారు.


