● అన్నదాతల మెరుపు ఆందోళన
హిరమండలం: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీలో రబీ పంటలకు నీరు స్థిరీకరణ లేకపోవడంతో పాటు ఉన్ననీటిని వృథాగా దిగువ సముద్రంలోకి విడిచిపెట్టడంతో నిరసనకు దిగారు. ఈ ఏడాది మోంథా తుఫానుతో వంశధారకు గట్లు, కరకట్టలు దెబ్బతిన్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు గాను బ్యారేజీలో ఉన్న నీటి ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు విడిచిపెట్టారు. ఈ విషయంపై ప్రత్యేక ప్రకటన చేయలేదు. ఇది తెలియని దిగువన ఉన్న రైతులు రబీలో భాగంగా వివిధ పంటలు వేసుకున్నారు. బ్యారేజీలో నీటి స్టోరేజీ తగ్గుముఖం పడుతోంది. దిగువకు నీటిని వృథాగా విడిచిపెట్టడంతో వంశధార నదీ తీర గ్రామాల రైతులంతా మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ముందే ప్రకటించి ఉంటే తాము సాగుచేసేవారం కాదని, తీరా పెట్టుబడులు పెట్టాక సాగునీరు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వందలాది మంది రైతులు గొట్టా బ్యారేజీపై ఆందోళనకు దిగడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, హిరమండలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి మాట్లాడగా.. వంశధార సిబ్బంది ఈ ఒక్క రోజుకు నీటిని దిగువకు వెళ్లకుండా నిలుపుదల చేస్తామని రైతులకు తెలిపారు. తర్వాతి రోజుకు మాత్రం కలెక్టర్, వంశధార ఎస్ఈ నుంచి ఆర్డర్ తె చ్చుకోవాలని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.


