శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని 154 హెల్త్ అసిస్టెంట్ల (ఏఎన్ఎంలు) ప్రమోషన్లకు సంబంధించి ఫైల్పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇద్దరు అధికారులను విచారణకు ఆదేశించారు. ఏడాదిన్నర కాలంగా తమకు రావాల్సిన గ్రేడ్–2 ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపేశారంటూ జిల్లాలో వివిధ పీహెచ్సీల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి విధితమే. రాత్రి కార్యాలయంలోనే నిద్రించి తిరిగి మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు తమ నిరసనను వీరు కొనసాగించారు. విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, పాలకొండ ఆర్డీవో స్వప్నిల్ పవార్ జగన్నాథం, జెడ్పీసీఈఓ సత్యనారాయణను తక్షణమే సంబంధిత కార్యాలయానికి వెళ్లి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశాలిచ్చారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డీఎంహెచ్ఓ చాంబర్లోకి వెళ్లి సంబంధిత ఫైల్ పూర్వాపరాలు పరిశీలించారు. ప్రమోషన్లు ఆగడానికి ఎస్టీ కమిషన్ విచారణే కారణమని డీఎంహెచ్ఓ అనిత సోమవారం చెప్పారు. 154 మంది ఉన్న ప్రమోషన్ లిస్టులో తమ ఎస్టీ రిజర్వేషన్ ప్రాతిపదికన 9 పోస్టులు రావాల్సి ఉండగా నాలుగే కేటాయించారని ఎస్టీ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వారికి గతంలోనే 412 శాంక్షన్ పోస్టుల్లో 24 కేటాయించాల్సి ఉన్నా 29 కేటాయించడంతోనే 5 పోస్టులు అదనంగా అప్పట్లోనే ఇచ్చేయడంతోనే ఇప్పుడు తగ్గించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ ఎస్టీ కమిషన్ సైతం మీ జిల్లాలోనే ఈ అంశం తేల్చుకోవాలని చెప్పినట్లు సమాచారం.


