శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ‘తపాలా అదాలత్’ను నిర్వహించనున్నట్లు తపాలాశాఖ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత మెరుగైన తపాలా సేవలు అందించడంలో భాగంగా ఈ నెల 26వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సూపరింటెండెంట్ కార్యాలయం, రెల్ల వీధి, ఎస్.ఎస్.ఆర్ డిగ్రీ, పీజీ కాలేజ్ దగ్గర గల తపాలా కార్యాలయంలో సూపరింటెండెంట్తో తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తపాలా సేవలకు సంబంధించిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్లో చర్చిస్తామని, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 25వ తేదీ లోగా ‘తపాలా అదాలత్ ‘అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫీసెస్ శ్రీకాకుళం, పోస్టల్ డివిజన్– శ్రీకాకుళం–532001 అనే చిరునామాకు పంపాలని కోరారు. ఫిర్యా దులు గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తు లు స్వీకరించబోమని, ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని అదాలత్కు హాజరు కావచ్చునని, ఆర్థిక అవకతవకలు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని తెలిపారు.
మాల్ఖానా భద్రత ఏర్పాట్ల పరిశీలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను ఒకే చోట అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న మాల్ ఖానాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో కలసి సోమవారం సందర్శించారు. నగరంలో ని వంశధార పాత క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక ప్రత్యేక కేంద్రాన్ని శనివారం వారిద్దరూ స్వయంగా భవనం లోపల, బయట కలియతిరిగి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అజాగ్రత్తకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బిల్డింగ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎస్ఐ పి.నరసింహమూర్తికి భద్రత విషయంలో పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిల్వ చేసిన పద్ధతిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ మురళీమోహన్, ఆర్ అండ్ బి అధికారులైన డీఈ ధనంజయ్, ఈఈ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
వాహన చోరీలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : వాహన చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టామని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను పెట్టి ద్విచక్రవాహనాలను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామన్నారు. గత ఏడాదిలో ద్విచక్రవాహన చోరీలకు సంబంధించి 103 కేసులు, ఈ ఏడాది 11 కేసులు కట్టి మొత్తంగా 76 కేసులు ఛేదించామన్నారు. వాహన చోరీలకు సంబంధించి సమీప పోలీ స్స్టేషన్లోనే కాక వాట్సాప్ ద్వారా సమాచారం అందజేయవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. చోరీకి గురైన వాహనాల పూర్తి వివరాలు, యజమాని వివరాలు, వాహనం పార్కింగ్ ప్రదేశం, తదితర సమాచారం కింది నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపితే తక్షణం స్పందిస్తామన్నారు. ఎస్పీ 6309990800, అదనపు ఎస్పీ (క్రైమ్) 6309990803, పోలీస్ కంట్రోల్ రూమ్ 6309990933ను సంప్రదించాలన్నారు.
18న జిల్లా సమీక్ష కమిటీ సమావేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 18వ తేదీన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:00 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని, సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.


