వజ్రపుకొత్తూరు రూరల్: గంగరాంపేట సమీపంలో విద్యుత్ స్తంభాన్ని శనివారం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపీరిపీల్చుకున్నారు. స్థానికులు, విద్యుత్ శాఖాధికారులు తెలిపిన వివరాలు మేరకు.. పల్లిసారధి గ్రామం నుంచి పలాస వైపు వస్తున్న కారు గంగారంపేట వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 11 కె.వి. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి నేలకు ఒరిగిపోగా.. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడికక్కడే కారును వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు వెంటనే కరెంట్ సరఫరా నిలుపుదల చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకొని కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి గురైన కారు ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టి నష్టపరిహారం వసూలు చేస్తామని విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణ తెలిపారు.


