అధిక ఒత్తిడి వద్దు
చదువుపై అనాసక్తి
జాగ్రత్తలు అవసరం
● నిద్ర లేమితో విద్యార్థుల సతమతం
● పరీక్షల ఒత్తిడితో అనారోగ్య సమస్యలు
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
హిరమండలం:
పరీక్షల సన్నద్ధతలో, ఎక్కువ మార్కులు సాధించాలనే ప్రయత్నంలో పడి నేటి విద్యార్థులు కనీస నిద్రకు నోచుకోవడం లేదు. అందులోనూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు సమీపిస్తుండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడితో మానసికంగా కుంగిపోతున్నారు.ఫలింతగా పదేళ్ల నుంచే మానసిక రుగ్మతలు బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆడుతూ,పాడుతూ సాగాల్సిన చదువులు చిన్నారుల పాలిట మోయలేని బారాన్ని మోపుతున్నాయి. చాలా పాఠశాలల్లో సమయపాలన నిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 7.30 గంటలకే పాఠాలు మొదలవుతున్నాయి. నివాసాలు దూరంగా ఉన్నవారు మరో గంట ముందే బయలు దేరాలి. సాయంత్రం ప్రత్యేక తరగతుల పేరుతో మరో గంట ఆలస్యంగా వదులుతున్నారు. దీంతో రాత్రి 7గంటల్లోపు ఇళ్లకు చేరుకోలేకపోతున్నారు.
నిద్రలేకపోతే..
● పిల్లలకు తగినంత నిద్రలేకపోతే వివిధ రకాల రుగ్మతలకు గురవుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. మెదడు చురుగ్గా పని చేయకపోవడం, ఆకలి మందగించడం, మతిమరుపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
● పరధ్యానంగా ఉండటం, చిన్న చిన్న విషయాలకే తీవ్రస్థాయి కోపం రావడం, అసహనంతో ఏడవటంవంటి చేస్తుంటారు. ఒత్తిడికిలోనై కొన్నిసార్లు విపరీత ఆలోచనలకు దారి తీస్తారు.
వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతారు.
● చిన్న వయస్సులోనే రక్తపోటుతోపాటు మధుమేహం బారిన పడే ప్రమాదం లేకపోలేదు.
● సరైన నిద్ర లేకపోతే హృద్రోగ సంబంధమైన వ్యాధులు దరి చేరే అవకాశం అధికంగా ఉంటుంది.
చిన్నారులపై అధిక ఒత్తిడి ఉండకూడదు. వారికి సరైన పౌష్టికాహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా చదివించినా ఫలితం ఉండదు. నీరు, పౌష్టికాహారం ఎక్కువ తీసుకోవాలి. నిద్రపోయే ముందు టీవీ చూడకూడదు. – టి.కేశవరావు, హెచ్ఎం,
హిరమండలం ప్రభుత్వ ఉన్నత
పాఠశాల
తక్కువ సమయం నిద్రపోవడం వల్ల తరగతులు జరిగే సమయంలో అభ్యసనం మీద పిల్లలకు శ్రద్ధ లేకుండా పోతుంది. నిద్రలేమి పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రబావం చూపుతూ వారి మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తోంది. అది మానసిక పరిస్థితులపై ప్రభావం చూపితే వారి భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. – జి.వి.రమణ,
సైకాలజీ ఉపాధ్యాయుడు
చిన్నారులపై ఒత్తిడి పెంచి చదివించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి గురిచేస్తే చిన్నారుల్లో సృజనాత్మకత కొరవడుతంది. మానసికంగా కుంగిపోతారు. సరైన నిద్ర లేకపోతే అనేక రుగ్మతలతో బాధపడాల్సి వస్తుంది.
– పి.సాయికుమార్, వైద్యాధికారి,
హిరమండలం పీహెచ్సీ


