
ఇసుక దందా
సముద్ర తీరంలో..
● నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు ● చదును చేసిన భూములను ఆక్రమించుకుంటున్న కూటమి నేతలు ● పట్టించుకోని అధికారులు
పోలాకి: ‘కాదేదీ అక్రమాలకు అనర్హం’ అనే రీతిలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ఏకంగా సముద్ర తీరప్రాంతంలోనూ ఉప్పు ఇసుక దందా సాగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలాకి మండలంలోని గుప్పెడుపేట, రాజపురం, డీఎల్పురం, కొత్తరేవు, అంపలాం, పల్లిపేట పంచాయతీల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న అటవీ భూముల్లో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది అటవీ భూముల పేరుతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం అటవీశాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నకొవిరిపేటలో దౌర్జన్యం..
పోలాకి మండలం గుప్పెడుపేట పంచాయతీ చిన్నకొవిరిపేటలో తన ఆధీనంలోని భూమిలో ఇసుక తవ్వకాలపై నిలదీసిన మైలపల్లి నారాయణ అనే వ్యక్తిపై ఇసుకాసురులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సర్వేనెంబర్–274 లో పట్టపగలే ఇసుకను తరలించి అక్కడే నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను సైతం నిర్మిస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1997లో ఇదే సర్వే నంబర్లో చిన్నకొరవిపేట అటవీ భూముల సాగుహక్కుల విషయంలో అప్పటి హరిశ్చంద్రపురం ఎమ్మెల్యే, ఇప్పటి రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో చేసుకున్న ఒప్పందాలను సైతం కాదని తమ భూముల్లో ఇసుక ఎత్తుకెళ్లిపోతున్నారని వారు వాపోతున్నారు.
నిర్మాణాలు ప్రశ్నార్థకమే:
ఉప్పుఇసుకతో భవనాలు, రహదారులు నిర్మాణం చేపట్టతుండటంతో వాటి నాణ్యత సైతం ప్రశ్నార్థకంగా మారుతోం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుకవిధానంలో ఇసుక ఉచితం అన్నప్పటికీ వినియోగదారునికి చేరేసరికి ట్రాక్టర్ లోడ్ రూ.1500 నుంచి రూ.2వేల వరకు పలుకుతోంది. అందులో సగానికే కేవలం రూ.500 నుంచి రూ.1000కే ఉప్పు ఇసుకను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వాటిని కొన్నిచోట్ల నదీ ప్రాంత ఇసుకతో మిక్సింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మండలంలో నిర్మాణం చేపట్టిన ఉపాధి సీసీ రహదారులు అన్నింటికీ ఇదే ఇసుక వినియోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆగడాలకు అడ్డేలేదు
మా సాగులో వున్న అటవీ భూమిలో పట్టపగలే ఇసుకను తరలించుకుపోతున్నారు. అడ్డుపడిన నా భర్తపై దౌర్జన్యం చేసేందుకు సైతం వెనకాడలేదు. పెద్దమనుషుల ముసుగేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామంలో అటవీ భూముల్లో ఇసుక ఎత్తుకెళ్లిన తర్వాత చదునుచేసి ఆ స్థలాలను కూటమి నాయకులు ఇష్టానుసారంగా అమ్మకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు.
– మైలపల్లి లావణ్య,
బాధితురాలు, చిన్నకొవిరిపేట

ఇసుక దందా

ఇసుక దందా

ఇసుక దందా