పోగొట్టుకున్న బ్యాగ్‌ తిరిగి అందజేత | - | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న బ్యాగ్‌ తిరిగి అందజేత

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

పుట్టపర్తి టౌన్‌: బస్సులో మహిళా ప్రయాణికులు పోగొట్టుకున్న బ్యాగ్‌ను గుర్తించి తిరిగి వారికి అందజేసి ఆీర్టీసీ ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. బుధవారం మండలంలోని కర్ణాటకనాగేపల్లికి చెందిన వరలక్ష్మి పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో తన బ్యాగ్‌ మరచిపోయింది. అందులో 5 గ్రాముల బంగారం (రెండు చిన్నకమ్మలు, బంగారు తాళిబొట్టు) ఉన్నాయి. గుర్తించిన స్వీపర్లు బుకింగ్‌ ఏజెంట్‌ ఖాదర్‌బాషా, అనౌన్సర్‌ సాయితేజ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బ్యాగును డిపో మేనేజర్‌ ఇనతుల్లాకు అందజేసి తమ నిజాయితీ చాటుకున్నారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులకు బ్యాగ్‌ను తిరిగి అందజేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.

అంజినప్పకు

ఆంధ్ర కళానిధి బిరుదు

బత్తలపల్లి: తేనె తెలుగు కల్చరల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు, కళాభిషేకం నిర్వాహకుడు యస్‌.అంజినప్పను ఆంధ్ర కళానిధి బిరుదుతో సత్కరించారు. సోమవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో రంగస్థల రాష్ట్రస్థాయి ప్రముఖ సీనియర్‌ నటుడు సుబ్బరాజు అధ్యక్షతన కళాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజినప్పను ఆంధ్ర కళానిధి బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో యువ కళాకారుడు, ట్రస్ట్‌ సమన్వయకర్త, టీచర్‌ ఆదినారాయణ, సీనియర్‌ నటులు బీసీహెచ్‌ వెంకయ్య, ప్రముఖ హరిశ్చంద్ర పాత్రధారి మినగల్లు సుధాకర్‌, సిహెచ్‌ మధుసూధన్‌, ఎస్‌.రమణయ్య, డి.శ్రీనివాసులు, వెంకారెడ్డి, బుజ్జయ్య, కళాకారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

రొద్దం: మండల పరిధిలోని పెను కొండ–పావగడ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండల కేంద్రంలోని పాత ఎస్సీ కాలనీకి చెందిన హనుమతప్ప కుమారుడు నరేష్‌ (28) ద్విచక్ర వాహనంలో కర్ణాటక కోడిమోడుగు నుంచి రొద్దంకు వస్తుండగా, మార్గమధ్యంలోని పెనుకొండ–పావగడ ప్రధాన రహదారిపై ఈద్గా వద్ద బైకు అదుపుతప్పింది. ఈ క్రమంలోనే బండ రాయిపై నరేష్‌ పడిపోవడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో రాజేంద్ర అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య ఉన్నట్లు తెలిసింది.

కారు ఢీకొని వ్యక్తి..

ముదిగుబ్బ: మండల పరిధిలోని రాళ్లనంతపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుల్లాయప్ప నాయక్‌ (55) అనే వ్యక్తి మృతి చెందాడు. ముదిగుబ్బ పోలీసులు తెలిపిన మేరకు.. రాళ్లనంతపురం తండాకు చెందిన కుల్లాయప్ప నాయక్‌ రోడ్డు దాటుతుండగా కదిరి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ముదిగుబ్బ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్‌కు తరలించారు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

అమడగూరు: మండల పరిధిలోని పూలకుంట్లపల్లికి చెందిన మస్తాన్‌ (45) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మస్తాన్‌ మంగళవారం రాత్రి పూలకుంట్లపల్లి సమీపంలో వ్యవసాయ పొలంలో జూదం ఆడుతుండుగా, గుర్తు తెలియని వ్యక్తులు టార్చ్‌లైట్‌ వేశారు. పోలీసులు వస్తున్నారని భయపడిన మస్తాన్‌ పరుగులు తీశాడు. ఈ క్రమంలోనే పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడుకి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement