సాక్షి, పుట్టపర్తి: ప్రజల నుంచి ఓట్లు దండుకుని గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలియదు. గెలిపించిన పాపానికి ప్రజలను గాలికొదిలేశారు. పొరుగు జిల్లాలో అక్రమాస్తులు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారనే ఆరోపణలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గంలో పాలన అటకెక్కి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఎక్కడుంటారో.. ఏమో?
జిల్లా వ్యాప్తంగా వాల్టా చట్టం పరిధిలో 51 గ్రామాలు ఉండగా.. అందులో మడకశిర నియోజకవర్గ పరిధిలో 15 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బోరుబావులు తవ్వేందుకు అనుమతులు లేవు. తాగునీటి సమస్య నెలకొన్న ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. స్థానికంగా కూటమి పార్టీల నాయకులకు ఎమ్మెల్యే రాజుతో విభేదాలు నెలకొనడం, మిత్రులకు కూడా ‘గుండు’సున్నా పెట్టడంతో ప్రజా సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక నాయకుడైతే ఇంటికే వెళ్లి నిలదీసే వారమని, కనీసం నియోజక వర్గంలో ఆయన ఇల్లు ఎక్కడుందో కూడా తెలియకపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోతున్నామని ప్రజలు నిట్టూరుస్తున్నారు. నీటి పారుదల చేయలేని రాజు నోటి పారుదలలో మాత్రం ముందు వరుసలో ఉన్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మడకశిర వ్యాప్తంగా క‘న్నీటి’ కష్టాలు
నిత్యం ఏదో ఒక చోట ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్న మహిళలు
సమస్యతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా
అడ్రెస్ లేని ఎమ్మెల్యే రాజు
గెలిపించిన పాపానికి గాలికొదిలిన వైనం
మండిపడుతున్న ప్రజానీకం
మడకశిర నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్న గ్రామాలు
రొళ్ల మండలంలో ఎం.రాయపురం, హెచ్టీ హళ్లి, టీడీ పల్లిలోని ఇందిరమ్మ కాలనీ, కొడ గార్లగుట్ట, బాజయ్య పాళ్యం, రత్నగిరి ఇందిరమ్మ కాలనీ, కాకి దొడ్డేరి, పిల్లిగుండ్ల కాలనీ.
అమరాపురం మండలం బసవనపల్లి, తమ్మడేపల్లి.
గుడిబండ మండలంలో ఫళారం, కేకాతి, బూదిపల్లి, మండల కేంద్రంలోని రాజు కాలనీ, మోపురుగుండు, గుణేమోరుబాగల్, ఎస్.రాయపురం.
అగళి మండలంలోని హుళికేర దేవరహళ్లి, ఇనగలూరు, మధూడి, నరసంబూది, పి. బ్యాడిగెర, రావుడి.
మడకశిర మండలంలోని మూడు గ్రామాల్లో నీటి సమస్య ఉంది. మున్సిపాలిటీలోని 6వ వార్డు ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.


