
ప్రశాంతంగా జీవించండి
పుట్టపర్తి టౌన్: గొడవలకు దూరంగా అందరూ ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ రత్న సూచించారు. శుక్రవారం రాత్రి ఆమె కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రామ సందర్శన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... గొడవలు, ఫ్యాక్షన్ వల్ల జీవితాలు చిన్నాభిన్నమవుతాయన్నారు. అలాంటి కుటుంబాల్లోని పిల్లల జీవితాలూ నాశనమవుతాయన్నారు. అందరూ ఎవరూ గొడవల జోలికి వెళ్లవద్దన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు, నూతన చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో ఏవైనా సంఘటనలు జరగితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం శక్తి యాప్, డయల్ 112, 100 గరించి వివరించారు. అంతకుముందు కళాజాత బృందం సభ్యులు నాటక ప్రదర్శన, ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, సీఐలు సురేష్, గోపీనాథ్రెడ్డి, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ సందర్శనలో ఎస్పీ రత్న

ప్రశాంతంగా జీవించండి