నిమ్మల బతుకంతా చీకటి మయమే | Sakshi
Sakshi News home page

నిమ్మల బతుకంతా చీకటి మయమే

Published Sat, Jun 3 2023 12:20 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ - Sakshi

గోరంట్ల: ‘హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప రాజకీయ అరంగేట్రం చేయక ముందు నుంచే తన ఆయిల్‌ మిల్లు ద్వారా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్‌ ఎగ్గొట్టేందుకు కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఆయిల్‌ తరలిస్తూ చీకటి వ్యాపారం చేశారు... ఆయన బతుకు మొత్తం చీకటి మయంగా కోనసాగుతోంది’ అని ఎమ్మెల్యే శంకరనారాయణ విమర్శించారు. అందువల్లే నిమ్మల కిష్టప్ప ప్రజాదరణ కోల్పోయి, వైఎస్సార్‌సీపీతో పాటు తమ కుటుంబపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు సుమన్‌రెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోరంట్ల మండలం బూదిలి సమీపంలోని కోటిలింగేశ్వరస్వామి ఆలయ భూమిని వైఎస్సార్‌సీపీ నాయకులు కబ్జా చేశారని, అందులో తమ కుటుంబ సభ్యుల హస్తం ఉందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పార్థసారధి , టీడీపీ నాయకురాలు సబితమ్మ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బూదిలి రెవెన్యూ పొలం సర్వే నంబర్‌ 532లో 19.36 ఎకరాల భూమి పట్టా భూమిగా రికార్డులో ఉందన్నారు. అయితే అందులో 4.84 ఎకరాల భూమి దేవాలయ కమిటీ పేరున 1950లో బసమ్మ అనే మహిళ వీలునామా రాసిందన్నారు. అదే సర్వే నంబర్‌లో గుత్తివారిపల్లికి చెందిన టీడీపీ మద్దతుదారు గొల్ల నరసింహప్ప తనకూ హక్కు ఉందంటూ 2010లో తన పేరున వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో ఎక్కించుకున్నారని తెలిపారు. 2022లో మలసముద్రం గ్రామానికి చెందిన రైతు రంగప్పకు విక్రయించారన్నారు. క్రయ విక్రయాల్లో తమ కుటుంబానికిగాని, పార్టీకిగాని ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. కేవలం అధికార పార్టీ పై అభాండాలు వేసి రాజకీయ లబ్ధి పొందడానికే తమ కుటుంబ సభ్యులు దేవుని భూమి కబ్జా చేశారని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప రాజకీయాల్లోకి రాక ముందు నుంచే చీకటి వ్యాపారం చేసిన నీచుడన్నారు. ఎంపీ , ఎమ్మెల్యే, మంత్రి అయిన తరువాత అనేక చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేసి డబ్బు దోచుకున్నారని విమర్శించారు. పట్టణంలోని మాధవరాయ దేవాలయం భూమిని ఆక్రమించి భక్తులకు ఇబ్బంది కలిగించడంతో పాటు అ స్థలంలో రూములు నిర్మించి బాడుగలను ఎంపీ నిమ్మల తీసుకుంటున్నారన్నారు. అలాగే వడిగేపల్లి సమీపంలో రైతుల నుంచి గతంలో బలవంతంగా భూములుకొని అందులో కొంత ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకున్నారని చెప్పారు. ఎంపీ నిమ్మల సాధారణ గొర్రెల కాపరులకు అందాల్సిన కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని నొక్కేశారన్నారు. మల్లాపల్లి సమీపంలో కంకర మిషన్‌ కోసం నిమ్మల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో నిమ్మల కుటుంబ సభ్యులు చేస్తున్న ఇసుక మాఫియాను అడ్డుకోబోయిన సొంత పార్టీ కార్యకర్త గొల్ల నరే్‌ష్‌ అనే వ్యక్తిని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించిన ఘనత నిమ్మలకే దక్కుతుందన్నారు. 9 సంవత్సరాలు మంత్రిగా, 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి సొంత పంచాయతీని అభివృద్ధి చేయని అసమర్థుడు నిమ్మల కిష్టప్ప అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్థసారధి కంకర మిషన్‌ ఏర్పాటు కోసం అక్కమ్మ కొండను ఆక్రమించుకున్నారన్నారు. గౌరవంగా జీవనం సాగిస్తున్న తన కుటుంబంపై అసత్య అరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నాలుకలు కోస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గోరంట్ల మార్కెట్‌ యార్డు అధ్యక్షులు బూదిలి వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నూర్‌మహ్మద్‌, జిల్లా సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌ పాటూరి శంకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ ధనుంజయరెడ్డి, బూదిలి సహకార సంఘం అధ్యక్షుడు రఘురామిరెడ్డి, పార్టీ నాయకులు పధ్మనాభరెడ్డి, నాగేనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలు చేస్తే నాలుక కోస్తాం

నిమ్మలపై నిప్పులు చెరిగిన

ఎమ్మెల్యే శంకరనారాయణ

Advertisement
Advertisement