నెల్లూరు(అర్బన్): తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు గురువారం జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని సర్వజన ఆస్పత్రి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ శరత్బాబు, రాష్ట్ర నాయకురాలు రూత్గ్రేస్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పదిరోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని చెప్పారు. తమతో సమానంగా విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ నర్సులతో పోలిస్తే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. వంద శాతం గ్రాస్ జీతం చెల్లించాలని, విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైతే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేణు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.


