● ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్
నెల్లూరు(అర్బన్): ‘సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, మౌలిక వసతులు అందాలనే లక్ష్యంతో డాక్టర్ జెట్టి శేషారెడ్డి పనిచేశారు. సారా వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యత, పొదుపు ఉద్యమాలకు వెనుక ఉండి పూర్తి సహకారం అందించిన శేషారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డా.పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం శేషారెడ్డి 18వ స్మారక సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ శేషారెడ్డి అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించేవారన్నారు. పాలకుల వల్ల సమాజం వర్గాలుగా విడిపోయిందన్నారు. నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అందువల్ల డాక్టర్ శేషారెడ్డి లక్ష్యాలను సాధించేందుకు ప్రజలు పోరాటాల్లోకి రావాలన్నారు.
● మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జనవిజ్ఞానవేదిక లాంటి సైన్సు సంస్థను స్థాపించిన వ్యక్తి డాక్టర్ శేషారెడ్డి అన్నారు. ఆయన సాంస్కృతి ఉద్యమాలకు పునాది వంటి వారన్నారు. పేదలు, సమాజ పురోభివృద్ధి పట్ల ఆయన ఎంతో ప్రేమ చూపేవారన్నారు. డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ చండ్ర రాజగోపాల్ మాట్లాడారు.
పాలకులకు గుణపాఠం చెప్పాలి
ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవరాజు మహరాజు ఆధునిక భారతదేశం– – శాసీ్త్రయ దృక్పథం అనే అంశంపై మాట్లాడారు. నేటి పాలకులు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పాలన్నారు. యూనివర్సిటీల్లో చిలుక జోస్యాన్ని కూడా పాఠ్యాంశాలుగా చేర్చే పరిస్థితి వచ్చిందన్నారు. డాక్టర్ అజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర నాయకులు డా.ఎంవీ రమణయ్య, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నరమాల సతీష్, జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ చలపతి, ఉపాధ్యాయులు, డాక్టర్లు పాల్గొన్నారు.


