● సీహెచ్సీ ఆవరణలో
కుటుంబసభ్యుల ఆందోళన
ఉదయగిరి రూరల్: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురిటి బిడ్డ మృతిచెందిన ఘటనపై బాధిత కుటుంబసభ్యులు బుధవారం సీహెచ్సీ ఆవరణలో బైటాయించి ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. వరికుంటపాడు మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లెబోయిన పావనికి నెలల నిండి ఉమ్మనీరు పోవడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. వైద్యురాలు నాగజ్యోతి తన సిబ్బందితో కలిసి వేకువజామున పావనికి కాన్పు చేశారు. అయితే కాన్పు సమయంలో పుట్టిన మగబిడ్డ మృతిచెందడంతో వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కాన్పు చేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ వైద్యశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వైద్యురాలు మాత్రం పావనికి ఇంటి వద్ద ఉమ్మనీరు పోయి వైద్యశాలకు వచ్చిందన్నారు. గైనకాలజిస్ట్ సూచనల మేరకు వైద్యం అందించామన్నారు. కష్టమైన కాన్పు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు వైద్యశాలకు వెళ్లాలని సూచించామన్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇక్కడే వైద్యం అందించాలని కోరారన్నారు. దీంతో కాన్పు చేసిన తర్వాత బిడ్డ మృతిచెందిందని ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు.


