నెల్లూరు(అర్బన్): కార్మికులకు అండగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు బుధవారం నుంచి పార్లమెంట్ ద్వారా చట్టంగా అమలు కావడాన్ని నిరసిస్తూ ఎల్ఐసీ ఏజెంట్లు, ఐసీయూ(ఇన్సురెన్స్ కార్పొరేషన్ యూనియన్) నాయకులు బ్లాక్ డేను నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బృందావనంలోని సిటీ బ్రాంచ్–2 వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎల్ఐసీ ఏఓఐ నెల్లూరు డివిజన్ రెసిడెంట్ సెక్రటరీ రాపూరు హజరత్రెడ్డి మాట్లాడారు. పోరాటాల ద్వారా ఎన్నో ఏళ్లు కష్టపడి కార్మికుల భద్రత కోసం ఒక్కొక్కటిగా 29 చట్టాలు సాధించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆయా చట్టాలను రద్దు చేయడం ద్వారా ఎల్ఐసీలో పనిచేస్తున్న 14 లక్షల మందిపై చిలుకు ఏజెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా లేకపోవడం, కార్మికుల హక్కులను కాలరాయడం, పని గంటలు పెంచడంతో కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం పాత చట్టాలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల నరసింహారావు, డివిజన్ ఉపాధ్యక్షులు ఎస్.నరసింహులు, వెంకటేశ్వర్లు, బ్రాంచ్ అధ్యక్షుడు రంగారావు తదితరులు పాల్గొన్నారు.


