● కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు
నెల్లూరు(దర్గామిట్ట): పీఆర్సీ కమిటీని నియమించాలని, మధ్యంతర భృతిని చెల్లించాలని నగరంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం యూటీఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు వీవీ శేషులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ వెంకట్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్.గౌస్బాషా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను పాత పింఛన్ విధానంలోకి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 57ను తప్పక అమలు పరచాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆకస్మికంగా మృతిచెందిన 956 మంది ఉపాధ్యాయులకు సంబంధించి వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.కిరణ్కుమార్, రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్.గౌస్బాషా, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి చలపతిశర్మ, గౌరవాధ్యక్షుడు ఎంసీ అచ్చయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు షేక్.ఖాజావలీ, పి.సుభాషిణి, కోశాధికారి ఎ.మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.


