ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్
● కడప కేంద్ర కారాగారానికి తరలింపు
నెల్లూరు(క్రైమ్): పదేపదే నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లపై పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మూలాపేట రాజీవ్ గృహకల్పకు చెందిన ఎస్.జయప్రకాష్ ప్రస్తుతం నవాబుపేటలో ఉంటున్నాడు. అతడిపై చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. నెల్లూరు నగరం, బుచ్చి పోలీస్స్టేషన్లలో ఐదు కేసులున్నాయి. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన షేక్ షాహుల్ హమీద్ ప్రస్తుతం జనార్దనరెడ్డి కాలనీ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నాడు. చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అతడిపై 28 కేసులున్నాయి. పలుమార్లు పోలీసులు ఇరు వురికి కౌన్సెలింగ్ నిర్వహించినా వారితీరులో మా ర్పురాలేదు. పదేపదే నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరిద్దరిపై కలెక్టర్ అనుమతితో పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న జయప్రకాష్, షాహుల్ హమీద్కు చిన్నబజారు పోలీసు లు నోటీసులు అందజేశారు. అనంతరం వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు గురువారం తెలిపారు.
బ్యాగ్లు కత్తిరించి నగదు, సెల్ఫోన్ చోరీ
నెల్లూరు(క్రైమ్): తల్లీకుమార్తె హ్యాండ్ బ్యాగ్లను కత్తిరించి నగదు, సెల్ఫోన్ను గుర్తుతెలియని దుంగులు అపహరించిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామంలో సుజాతమ్మ నివాసం ఉంటున్నారు. ఆమె బుధవారం తన కుమార్తెను తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. కుమార్తెకు చికిత్స చేయించి తిరిగి తమ స్వగ్రామం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్కు వచ్చారు. బస్సు ఎక్కే క్రమంలో సుజాతమ్మ హ్యాండ్ బ్యాగ్ను గుర్తుతెలియని దుండగులు కోసి అందులో ఉన్న రూ.50 వేల నగదు, ఆమె కుమార్తె చేతిలోని సంచిని కోసి రూ.7 వేల నగదు, సెల్ఫోన్ తదితరాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోనే
కొనసాగించాలంటూ..
● తెలుగుగంగ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా
పొదలకూరు: స్థానిక తెలుగుగంగ, సోమశిల డీఈ కార్యాలయాల వద్ద మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కలువాయి, రాపూరు మండలాల్లో సోమశిల, కండలేరు జలాశయాలున్న కారణంగా నీటి పారుదలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. కాలువలు ఒక జిల్లాలో, ప్రాజెక్ట్లు మరో జిల్లాలో ఉంటే రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన పైమూడు మండలాలను యథావిధిగా కొనసాగించాల్సిందిగా కోరారు. ధర్నాలో సీహెచ్ చినసుబ్రహ్మణ్యం, సీహెచ్ వెంకటేశ్వర్లు, గురుస్వామి, జనార్ధన్రెడ్డి, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
కాస్మొటిక్స్ దుకాణాలపై
విజిలెన్స్ దాడులు
నెల్లూరు(క్రైమ్): కంపెనీతో సంబంధం లేకుండా నకిలీ ఎమ్మార్పీ ధరలు అతికించి ఫేస్క్రీమ్స్ను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఓ కంపెనీకి చెందిన ఫేస్క్రీమ్ రూ.699 ఉండగా స్టిక్కర్ను తొలగించి రూ.1,699కు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా చిన్నబజారులోని సావన్ కాస్మొటిక్స్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో తయారీ తేదీ లేకుండా, ఎక్స్పైరీ అయిన వస్తువులు సైతం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుకాణంలోని సరుకును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీటీఓ విష్ణురావు తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 60.460 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,750 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 830, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 70, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.


