జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం

Jun 16 2025 7:05 AM | Updated on Jun 16 2025 7:05 AM

జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం

జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం అనే విషయం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్ధమైందని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అన్నారు. ‘జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనం ఆరుణమ్మ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్‌సిక్స్‌ పథకాల పేరుతో రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు పాలన ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 143 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు తూతూ మంత్రంగా ఒకటిరెండు పథకాలను అమలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఉచిత గ్యాస్‌ సిలెండర్‌, తల్లికి వందనం పథకాల్లో పారదర్శకత లోపించిందన్నారు. ఓటు వేసిన ప్రజలను కించపరిచేలా వారి నాలుక కోస్తామని చంద్రబాబు మాట్లాడాన్ని వారు అసహ్యంచుకుంటున్నారని అన్నారు. 18 నుంచి 59ఏళ్లలోపు మహిళలు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయమని కోరుతుంటే ఇవ్వకుండా పీ–4తో అనుసంధానం చేస్తామని కబుర్లు చెప్పడంపై మండిపడ్డారు. నిరుద్యోగభృతిని పీ–4కు అనుసంధానం చేస్తామని యువతను మభ్యపెట్టడం దారుణమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్‌ అమలు ఊసే లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను దగా చేస్తున్న క్రమంలో జగన్‌ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు. ఈ పుస్తకం చంద్రబాబు పాలనను గుర్తుచేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న పోరాటాలకు భయపడిన చంద్రబాబునాయుడు తల్లికి వందనం పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారన్నారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ తల్లికి వందనం అందకపోవడం బాబు మోసపూరిత శైలికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెట్టడాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోనల్‌ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్‌ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు దాసరి భాస్కర్‌గౌడ్‌, సాయిమోహన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement