
నేత్రపర్వంగా శేష వాహనోత్సవం
సంగం:మండలంలోని దువ్వూరులోని గంగా పార్వతి సమేత కోటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శని వారం అర్ధరాత్రి స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవేరులను శేషవాహనంపై కొలువుదీర్చి పూలతో విశేషంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. బలిజ సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
కాకాణి కేసుల్లో యాంటిసిపేటరీ
బెయిల్ పిటిషన్ దాఖలు
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పోలీసులు పలు అక్రమ కేసులను బనాయించారు. కనుపూరు చెరువులో మట్టిని కాకాణి తన మనుషుల ద్వారా అక్రమంగా తరలించినట్టు వెంకటాచలసత్రం పోలీసులు క్రైమ్ నంబర్ 103/2025తో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోవర్ధన్రెడ్డి తరుఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, సిద్దన సుబ్బారెడ్డి నెల్లూరు నాల్గో అదనపు జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అసోసియేషన్ పేరిట చెక్పోస్ట్ పెట్టి తన అనుచరుల ద్వారా వాహనాల యాజమానుల నుంచి అక్రమ పద్ధతిలో నగదు వసూలు చేశారని ముత్తుకూరు పోలీసులు కాకాణిపై క్రైమ్ నంబర్ 167/2025తో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, సిద్దన సుబ్బారెడ్డి నెల్లూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసులు సోమవారం విచారణకు రానున్నాయి.
వెంకటంపేటలో వైఎస్సార్
విగ్రహం ధ్వంసం
దుత్తలూరు: మండలంలోని వెంకటంపేటలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు ధ్వంసం చేశారు. వైఎస్సార్ విగ్రహం ఎడమచేతిని విరగ్గొట్టారు. విగ్రహం వద్ద మద్యం బాటిళ్లు ఉండడంతో మద్యం మత్తులో కావాలనే దుశ్చర్యకు పాల్పడినట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు. కాగా వైఎస్సార్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
21 నుంచి
పాలిసెట్ కౌన్సెలింగ్
నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు, జూలై 1న ఆప్షన్లలో మార్పులు, చేర్పులు, 3న సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని వివరించారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్, టీసీ, ఆన్లైన్లో చెల్లించిన ఫీజు రసీదు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని సూచించారు.
నేడు పెంచలకోనలో
మెగా యోగాంధ్ర
నెల్లూరు (టౌన్): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెంచలకోన క్షేత్రంలో సోమవారం మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో మెగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే నెల్లూరు, మైపాడుబీచ్, ఉదయగిరిలో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఉదయం 7 గంటలకు పెంచలకోనలో నిర్వహించే మెగా యోగాంధ్ర కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయా లని కోరారు.

నేత్రపర్వంగా శేష వాహనోత్సవం