
వైభవంగా వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఆదివారం నిలుపు కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వేదపండితులు వెంగమాంబ, గురవయ్య దంపతులను పూలతో విశేషంగా అలంకరించి గణపతిపూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు నవగ్రహ పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం కలశపూజ నిర్వహించారు. తొలిరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు సంతానం కోసం అమ్మవారి వద్ద వరపడ్డారు.
అట్టహాసంగా నిలుపు
వెంగమాంబ పుట్టినిల్లు వడ్డిపాళెంలోని దేవర ఇంట్లో ఆదివారం రాత్రి నిలుపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం రేణుకా ఎల్లమ్మ గుడిలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మండపారాధన, వెంగమాంబ, రేణుకా ఎల్లమ్మకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి పచ్చవ వంశస్తులు పసుపు దంచే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వెంగమాంబ ఉత్సవాల్లో పసుపు దంచితే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన ముత్తైదువులు పసుపు దంచేందుకు పోటీపడ్డారు. అనంతరం పసుపు, కుంకుమను అమ్మవారి దేవస్థానం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో నిలుపు కార్యక్రమం
పసుపు దంచేందుకు
పోటీపడిన ముత్తైదువులు

వైభవంగా వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం