గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
● గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ
● జిల్లా పోలీస్ అధికారులతో
వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు సిటీ: గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ ఆదేశించారు. గురువారం రాత్రి ఆయన జిల్లా పోలీస్, ఎస్ఈబీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, పొరుగు మద్యం విక్రయాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకుని సిబ్బందికి సూచనలిచ్చారు. పదే పదే నేరాలకు పాల్పడేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. సమావేశంలో ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీలు హిమావతి, ప్రసాద్, సెబ్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు.