WTC Final 2023: రోహిత్‌ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్‌ వర్మ రియాక్షన్‌.. వైరల్‌

WTC Final 2023: Rohit Yashasvi Jaiswal Depart for UK Tilak Varma Reaction Viral - Sakshi

WTC Final 2021-23 Ind Vs Aus: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ముంబై యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ లండన్‌కు పయనమయ్యారు. వీరిద్దరు ఆదివారం సాయంత్రం యూకే బయల్దేరారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023 నేపథ్యంలో ఈ ముంబైకర్లు ఇంగ్లండ్‌ విమానం ఎక్కేశారు. కాగా ప్రఖ్యాత ఓవల్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2023 ముగిసిన తర్వాత
జూన్‌ 7న మొదలుకానున్న ఈ మెగా ఫైట్‌ కోసం ఇప్పటికే విరాట్‌ కోహ్లి, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. మరోవైపు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో ఉన్న అజింక్య రహానే, శుబ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ షమీ తదితరులు ఐపీఎల్‌-2023 ఫైనల్‌ ముగిసిన తర్వాత బయల్దేరనున్నారు.

ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టుకు స్టాండ్‌బై ఎంపికైన రుతురాజ్‌ గైక్వాడ్‌ తప్పుకోవడంతో.. అతడి స్థానంలో రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలన ఓపెనర్‌ యశస్వికి ఛాన్స్‌ వచ్చింది. ఇంతవరకు టీమిండియా తరఫున అరంగేట్రం చేయని 21 ఏళ్ల యశస్వి మెగా ఫైట్‌ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.

తిలక్‌ వర్మ రియాక్షన్‌.. వైరల్‌
ఈ క్రమంలో రోహిత్‌ శర్మతో కలిసి లండన్‌కు బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను యశస్వి జైశ్వాల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశాడు. ‘‘వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కోసం ఇంగ్లండ్‌కు పయనం. అది కూడా వన్‌ అండ్‌ ఓన్లీ రోహిత్‌ శర్మతో’’ అంటూ క్యా​​​​ప్షన్‌ జతచేశాడు. 

ఇక యశస్వి పోస్టుకు స్పందించిన హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ.. ‘‘చాలా సంతోషంగా ఉంది జస్సూ’’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌లో యశస్వి సహచర ఆటగాడు, ఇంగ్లండ్‌ మాజీ సారథి జో రూట్‌ సైతం యశ్‌కు గుడ్‌ లక్‌ చెప్పాడు. రోహిత్‌తో యశస్వి కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో లెఫ్టాండ్‌ బ్యాటర్‌ యశస్వి 14 మ్యాచ్‌లు ఆడి 625 పరుగులు సాధించాడు. ఓ శతకం నమోదు చేశాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ స్టాండ్‌ బైగా ఎంపికైన సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ కూడా లండన్‌కు బయల్దేరినట్లు సమాచారం. కాగా ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సహా రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు గాయాల కారణంగా దూరమైన విషయం తెలిసిందే.

చదవండి: IPL 2023 Final: ధోని సేనకు శుభ సూచకం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top