వైభవ్, రియాన్ (PC: BCCI/IPL)
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా ఫైనల్ చేరాలన్న రాయల్స్ కలలు చెదిరిపోయాయి.
అంచనాలకు మించి
ఈ నేపథ్యంలో గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తమ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. తమ ప్రయాణం ఇక్కడి వరకు సాగడమే గొప్ప విషయమని అతడు అన్నాడు.
ఈ మేరకు.. ‘‘ఈ పిచ్పై 215 అనేది కాపాడుకోదగ్గ స్కోరే. అయితే, రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింతగా అనుకూలించడం మాపై ప్రతికూల ప్రభావం చూపింది. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా సాగింది.
మేము మరో 15- 20 అదనపు పరుగులు సాధించి ఉండే బాగుండేది. ఏదేమైనా ఈ సీజన్ మాకు సానుకూలంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మేము అసలు ప్లే ఆఫ్స్నకు కూడా అర్హత సాధించే స్థితిలో లేము.
చాలా మంది యువ ఆటగాళ్లే
మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఐపీఎల్ ఆడుతున్నారు. సీజన్కు ముందు ఎన్నెన్నో మార్పులు.. ఎన్నో విభిన్న కాంబినేషన్లు ప్రయత్నించి చూశాము.
అయినప్పటికీ మా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడి ఇక్కడి దాకా చేరుకున్నారు. మాకు ఇదొక గొప్ప ఆరంభం. ఈ ప్రయాణంలో మున్ముందు మెరుగ్గా రాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
వైభవ్ సూర్యవంశీనే కారణం
ఇక గుజరాత్తో క్వాలిఫయర్-2లో తాము గట్టిగా పోరాడగలిగామంటే అందుకు వైభవ్ సూర్యవంశీనే కారణమని రియాన్ పరాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అతడు టీమిండియాకు ఆడితే చూడాలని ఉందని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. వైభవ్ ఆట గాలివాటం కాదని.. పక్కా ప్రణాళికతోనే అతడు మైదానంలో దిగుతాడని ప్రశంసించాడు.
ఆర్సీబీతో ఫైనల్లో గుజరాత్
కాగా ముల్లన్పూర్ వేదికగా గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్) రాణించాడు.
ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రాజస్తాన్ 214 పరుగులు చేయగలిగింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
చదవండి: హార్దిక్ పాండ్యా కూడా!


