సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అండర్–19 బాలుర జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 28.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆర్యాన్ యాదవ్ (29), విహాన్ (28) కాస్త పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ 3 వికెట్లు పడగొట్టగా... మలిక్, నిపుణ్ రెడ్డి, ఉజైర్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం హైదరాబాద్ 29.3 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. అలంకృత్ రాపోల్ (70 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించగా... అవేజ్ అహ్మద్ (85 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వినూ మన్కడ్ ట్రోఫీ గెలిచిన జట్టు సభ్యులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) రూ. 2 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ. 1.50 లక్షలు అందించనుంది.


