
యూఏఈ ట్రై సిరీస్-2025లో ఇదివరకే ఫైనల్కు క్వాలిఫై అయిన ఆఫ్ఘనిస్తాన్.. నిన్న యూఏఈతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో తృటిలో ఓటమి తప్పించుకుంది. ఈ మ్యాచ్లో యూఏఈ ఓడినా, అద్భుతంగా పోరాడింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యానికి యూఏఈ 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు గుర్బాజ్ (40), ఇబ్రహీం జద్రాన్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరీం జనత్ (28), గుల్బదిన్ నైబ్ (20 నాటౌట్), అజ్మతుల్లా (14 నాటౌట్) ఆఖర్లో వేగంగా పరుగులు సాధించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ 2 వికెట్లు తీయగా.. సిమ్రన్జీత్ సింగ్, ముహమ్మద్ ఫరూక్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి ఓవర్లో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. యూఏఈ తొలి మూడు బంతులకే 12 పరుగులు చేసి గెలుపు ఖాయమనుకుంది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ అనూహ్యంగా పుంజుకుని చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.
దీంతో యూఏఈకి ఓటమి తప్పలేదు. యూఏఈ ఇన్నింగ్స్కు కెప్టెన్ ముహమ్మద్ వసీం (44), అలీషాన్ షరాఫు (27) శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో ఆసిఫ్ ఖాన్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చివరి రెండు బంతులను వృధా చేసి, మూడో బంతికి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్, ముజీబ్, షరాఫుద్దీన్, నూర్ అహ్మద్, అహ్మద్జాయ్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీ ఫైనల్ రేపు జరుగనుంది. టైటిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తలడపడతాయి. ఈ టోర్నీ ముగియగానే ఇరు జట్లు ఆసియా కప్లో పాల్గొంటాయి.