
PC: BCCI/IPL.com
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ ట్రై సిరీస్లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది.
ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే రాణా మార్చేసింది. రాణా ఓవరాల్గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్( 107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ప్రతీక సూపర్ ఇన్నింగ్స్..
ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రతీక రావల్(78) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(41), జెమీమా రోడ్రిగ్స్(41), మంధాన(36) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు పడగొట్టగా..ఖాకా, క్లాస్ తలా వికెట్ సాధించారు.
చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం