
ఐపీఎల్ సమయంలో పంత్, రాహుల్లతో గోయెంకా (PC: IPL)
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.
రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలు
కాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్రేటుతో 134 పరుగులు సాధించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.
అమోఘం.. రాహుల్కు కంగ్రాట్స్
ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.
టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.
కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.
రాహుల్పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్
ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.
అనంతరం ఆక్షన్లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.
గెలుపునకు పది వికెట్ల దూరంలో
ఇక పంత్ సేన తాజా ఎడిషన్లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.
ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి.
చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’
𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩
WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025