తొలిసారి మహిళల రగ్బీ లీగ్‌  | Rugby Premier League To Launch Inaugural Womens Edition | Sakshi
Sakshi News home page

తొలిసారి మహిళల రగ్బీ లీగ్‌ 

Apr 28 2026 6:02 AM | Updated on Apr 28 2026 6:02 AM

Rugby Premier League To Launch Inaugural Womens Edition

జూన్‌లో హైదరాబాద్‌ వేదికగా నిర్వహణ  

న్యూఢిల్లీ: గత ఏడాది మొదటిసారి పురుషుల కోసం భారత్‌లో రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ (ఆర్‌పీఎల్‌) జరగ్గా... రెండో ఏడాది ఏకకాలంలో పురుషులతోపాటు మహిళల రగ్బీ లీగ్‌ను నిర్వహించనున్నారు. జూన్‌ 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌కు ఆతిథ్యమిస్తుంది. క్రితంసారి పురుషుల విభాగంలో ఆరు జట్లు పోటీపడ్డాయి. ఆ ఆరు పురుషుల జట్లలో నుంచి నాలుగు జట్లతో (చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్‌) మహిళల విభాగం పోటీలు నిర్వహిస్తారు. జీఎంఆర్‌ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సహకారంతో రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ జరగనుంది. 

ఈనెల 30న హైదరాబాద్‌లో వేలం కార్యక్రమం జరగనుంది. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్‌తోపాటు హైదరాబాద్‌ హీరోస్, బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్‌ ఆర్‌పీఎల్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. గత ఏడాది ముంబైలో జరిగిన తొలి సీజన్‌లో చెన్నై బుల్స్‌ టైటిల్‌ సాధించింది. ‘మహిళల విభాగంలోనూ రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించాలని కల కన్నాం. రెండో ఏడాదే మా కల నిజమవుతోంది. ఈ విషయంలో జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ను, మా ఫ్రాంచైజీలను అభినందించాలి’ అని రగ్బీ ఇండియా అధ్యక్షుడు, సినీ నటుడు రాహుల్‌ బోస్‌ తెలిపాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement