టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి పంత్ వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటిచింది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడి అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించింది. క్రికెట్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులువు కాదు. ఒక కెప్టెన్గా అతడు సూపర్ జెయింట్స్కు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.
ఇప్పుడు మా దృష్టి అంతా జట్టు ప్రయోజనాల పైనే ఉంది. రాబోయే రోజుల్లో జట్టును మళ్లీ పటిష్టంగా నిర్మించడమే మా లక్ష్యమని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కెప్టెన్గా అట్టర్ ప్లాప్
కాగా ఐపీఎల్-2025 వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ స్ధానంలో తమ జట్టు పగ్గాలను పంత్కు లక్నోకు అప్పగించింది. కానీ లక్నో యాజమాన్యం నమ్మకాన్ని రిషబ్ నిలబెట్టుకోలేకపోయాడు.
ఐపీఎల్-2025, 26 సీజనల్లో అతడి కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ రెండు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో లక్నో మరింత ఘోరంగా విఫలమైంది.
ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంత్ కెప్టెన్గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకొన్నాడు.
చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’


