ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో చివరకు రాజస్తాన్ రాయల్స్నే విజయం వరించింది. గుజరాత్ టైటాన్స్ సీజన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఓటమిపై స్పందించాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నిజానికి మేము మంచిగానే బౌలింగ్ చేశాం. తొలుత రాజస్తాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనుకున్నాం. కానీ మా బౌలర్లు కట్టడి చేయడంతో 210 పరుగులకు కట్టడి చేశాం. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ మంచి ఆరంభమే దక్కింది.
ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్పై పట్టు కోల్పోయాం. అయితే భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉండడం సహజం. ఇలాంటి పిచ్పై ఓవర్కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి.
అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం.
ఆఖరి ఓవర్ లో మా మధ్య (రబాడతో) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్లో రాణిస్తాం. మా రెగ్యులర్ కెప్టెన్ గిల్ తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడు.’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.


