టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా? | List Of Highest Successful Run Chases In Test Cricket At The Oval | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?

Aug 3 2025 9:35 AM | Updated on Aug 3 2025 12:48 PM

List Of Highest Successful Run Chases In Test Cricket At The Oval

ఆండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలోని ఆఖ‌రి టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ ఐదో టెస్టులో భార‌త్ త‌మ విజ‌యానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిల‌వ‌గా.. ఇంగ్లండ్ గెలుపున‌కు ఇంకా 324 ప‌రుగులు కావాలి.  374 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 50 పరుగులు చేసింది.

దాదాపు నాలుగో రోజు ఆట‌లో ఫ‌లితం తేలే అవ‌కాశ‌ముంది. ఎలాగైనా ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి సిరీస్‌ను స‌మంతో ముగించాల‌ని భార‌త ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం స్కోర్ ఛేజ్ చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నేప‌థ్యంలో లండ‌న్‌లోని కెన్నింగ్టన్ ఓవ‌ల్ మైదానంలో విజ‌య‌వంత‌మైన ర‌న్‌ఛేజ్‌ల‌పై ఓ లుక్కేద్దాం. 

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 1880లో తొలి టెస్టు మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. 145 సంవత్సరాల ఈ మైదానం చ‌రిత్ర‌లో 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించ‌లేదు.

ఇంగ్లండ్‌ చరిత్రను తిరగరాస్తుందా?
ఈ మైదానంలో అత్య‌ధిక ర‌న్ ఛేజ్ చేసిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1902లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 263 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 141 ఆధిక్యం ల‌భిస్తోంది.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ప‌ర్యాట‌క ఆసీస్ జ‌ట్టు కేవ‌లం 121 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఈ క్ర‌మంలో తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని క‌లుపున‌కుని ఇంగ్లండ్ ముందు కంగారులు 263 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచారు. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి చేధించింది.

ఆ త‌ర్వాత ఓవ‌ల్‌లో రెండ‌వ అత్య‌ధిక ర‌న్ చేజ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. విండీస్‌లో 1963లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విండీస్ 252 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించింది.

అనంత‌రం 1972లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టులో 242 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించింది. ఇది ఓవ‌ల్ మైదానంలో మూడో అత్యంత విజ‌య‌వంత‌మైన ర‌న్ చేజ్‌గా నిలిచింది.

ఈ మైదానంలో చివ‌ర‌గా 2024లో శ్రీలంక జ‌ట్టు ఇంగ్లండ్‌పై 219 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేజ్ చేసింది. ఇది ఓవ‌ల్‌లో ఐదో  అత్యంత విజ‌య‌వంత‌మైన ర‌న్ చేజ్‌గా నిలిచింది. ఇప్పుడు భారత్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే 123 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


 

Advertisement
 
Advertisement
Advertisement