భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 49 ఓవర్లు వేసిన అతడు.. 102.5 సగటున కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఓ టీ20 టోర్నీలో కనీసం 40 ఓవర్లు వేసిన బౌలర్లలో ఇదే అత్యంత చెత్త సగటు. ఇప్పటివరకు ఏ బౌలర్ 100 మార్కు (సగటు) కూడా తాకలేదు. ఈ స్థాయి చెత్త ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.
బుమ్రా తర్వాత యావత్ టీ20 ఫార్మాట్లో (ఓ టోర్నీ సింగిల్ ఎడిషన్లో) అత్యంత చెత్త సగటు (కనీసం 40 ఓవర్లు) కలిగిన బౌలర్లుగా ప్రగ్యాన్ ఓఝా (ముంబై ఇండియన్స్ తరఫున 95 సగటు), ప్రసిద్ద్ కృష్ణ (కేకేఆర్, 94.25), బెన్నీ హోవెల్ (చట్టోగ్రామ్ ఛాలెంజర్స్, 86.25), మొహమ్మద్ ఆమిర్ (కరాచీ కింగ్స్, 69.8) ఉన్నారు.
ఇదిలా ఉంటే, బుమ్రా పేలవ ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో ముగించింది. ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. రేపు జరుగబోయే తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనుండగా.. 27న జరుగబోయే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ అమీతుమీ తేల్చుకుంటాయి.


