డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. ఛాంపియన్ హోదాకు సార్దకత చేకూరుస్తూ, తొలి మ్యాచ్లోనే అబ్బురపరిచే విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (మార్చి 28) జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్పై ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్రైజర్స్ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు.
వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.
దంచికొట్టిన పడిక్కల్, కోహ్లి
అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ.. దేవ్దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. విరాట్ సిక్సర్, హ్యాట్రిక్ బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేసిన జేకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


