గుజరాత్ వర్సెస్ రాజస్తాన్ (PC: BCCI/IPL)
క్వాలిఫయర్-1లో ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్.. తనకున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్లో మూడోసారి ఫైనల్ చేరడమే లక్ష్యంగా రాజస్తాన్ రాయల్స్తో పోటీకి సిద్ధమైంది.
ముల్లన్పూర్ వేదికగా..
ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్- రాజస్తాన్ మధ్య ఈ నాకౌట్ మ్యాచ్కు న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో గల మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక.
పొంచి ఉన్న ప్రమాదం
కాగా వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముల్లన్పూర్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయంత్రం మేఘావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్కు కొద్దిమేర వర్ష ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు.
సాయంత్రానికి పరిస్థితి చక్కబడితే మాత్రం మ్యాచ్కు ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ వాన వల్ల మ్యాచ్కు ఆటంకం కలిగితే, రద్దైతే పరిస్థితి ఏమిటి?.. ఐపీఎల్ నిబంధల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు.
మ్యాచ్ రద్దైతే?
కాబట్టి వర్షం వల్ల ఇప్పుడు క్వాలిఫయర్-2కు అంతరాయం కలిగితే.. 16.10.3 క్లాజ్ ప్రకారం.. ఇరుజట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు టై అయితే.. ఫలితం తేలేంత వరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు.
అయితే, సూపర్ ఓవర్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోతే.. గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు కలిగి ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. ఒకవేళ పాయింట్లు కూడా సమంగా ఉంటే అప్పుడు నెట్రన్రేటు కీలకంగా మారుతుంది.
కాగా గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లు సాధించింది. మరోవైపు.. రాజస్తాన్ పద్నాలుగింట ఎనిమిది గెలిచి.. 16 పాయింట్లతో ఉంది. కాబట్టి.. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.
ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫయర్-2 ఆడే పరిస్థితి తెచ్చుకుంది.
ఆర్సీబీతో తలపడేది ఎవరో!
మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో పటిష్ట సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి.. క్వాలిఫయర్-2 రూపంలో సువర్ణావకాశం దక్కించుకుంది. కాగా ఐపీఎల్-2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. క్వాలిఫయర్-2 విజేతతో మే 31న ఆర్సీబీ అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది. కాగా గతేడాది ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవగా.. గుజరాత్ తమ అరంగేట్ర సీజన్ 2022లోనే ట్రోఫీ సాధించింది. ఇక 2023లో కూడా ఫైనల్ చేరిన గుజరాత్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.
చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన


